కాబూల్: అమెరికాపై తాలిబన్లు( Taliban ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఓ పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని డ్రోన్ సాయంతో అమెరికా బలగాలు పేల్చేసిన విషయం తెలుసు కదా. అయితే తమకు చెప్పకుండా ఈ దాడిని అమెరికా ఏకపక్షంగా ఎలా చేస్తుందని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రశ్నించాడు. చైనా అధికారిక చానెల్ సీజీటీఎన్తో సోమవారం మాట్లాడిన అతడు.. ఈ డ్రోన్ దాడిలో ఏడుగురు పౌరులు చనిపోయినట్లు చెప్పాడు. విదేశీ గడ్డపై అమెరికా ఇలాంటి చర్య తీసుకోవడం చట్ట విరుద్ధమని జబీహుల్లా అన్నాడు.
ఆఫ్ఘనిస్థాన్లో ఏదైనా ముప్పు ఉంటే దానిని మాకు ముందుగా చెప్పాలి. ఇలా పౌరులు చనిపోయేలా అమెరికా ఏకపక్ష దాడి ఎలా చేస్తుంది అని ప్రశ్నించాడు. అయితే ఆ ఆత్మహుతి కారు బాంబర్ కాబూల్ ఎయిర్పోర్ట్పై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడని పెంటగన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో పౌరులు చనిపోవడంపై విచారణ జరపనున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.