వాషింగ్టన్, సెప్టెంబర్ 23: కరోనా టీకా గర్భిణులకు మంచిదేనని, టీకా వేసుకున్న గర్భిణుల నుంచి బిడ్డలకు యాంటిబాడీలు బదిలీ అవుతున్నాయని అమెరికాలోని ఎన్వైయూ గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఎంఆర్ఎన్ఏ ఆధారిత కొవిడ్-19 వ్యాక్సిన్లపై ఈ పరిశోధన సాగింది. ఫైజర్ లేదా మోడెర్నా టీకా వేసుకున్న 36 మంది గర్భిణులు, వారికి పుట్టిన పిల్లలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వ్యాక్సిన్ వేసుకున్న గర్భిణుల బొడ్డుతాడు రక్తంలో యాంటిబాడీల స్థాయిలు అధికంగా ఉన్నట్టు గుర్తించామని, ఈ ఫలితాలు గర్భిణులు టీకా వేసుకునేలా ప్రోత్సహిస్తాయని పరిశోధకురాలు జెన్నిఫర్ ఎల్ లైటర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గర్భిణులు ఎలాంటి సంకోచం లేకుండా టీకా వేసుకోవాలని సూచించారు.