హైదరాబాద్ : గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీల అనుమతితో స్థానిక అవసరాల మేరకు నిధులు ఖర్చు చేసుకోవచ్చంటూ ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా జీవోతో పల్లెల ప్రగతి మరింత పరుగులు పెట్టనుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ జీవో రావడం వల్ల ఇప్పటికే పల్లె ప్రగతితో అభివృద్ధి, పారిశుద్ధ్యం, పచ్చదనం పరుచుకున్న పల్లెలు ఇక ప్రగతిలోనూ మరింతగా పరుగులు పెడతాయన్నారు. జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
జీవో జారీపై మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల నిధులను, పై అధికారుల అనుమతులు లేకుండానే, ఆయా గ్రామ ప్రజలు, పంచాయితీల తీర్మానం మేరకే ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ నిన్న రాత్రి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ప్రభుత్వం సంబంధిత జీవో 18ని జారీ చేసింది. తద్వారా ఇక నుంచి స్థానిక అవసరాల మేరకు నిధులను ఖర్చుచేసుకునే వెసులుబాటు పంచాయతీలకు లభిస్తుంది. అయితే, గ్రామ సభ ఆమోదం మేరకు గ్రామ అవసరాలకు అనుగుణంగా ఆయా పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆయా పనులన్నీ నిబంధనల మేరకు మాత్రమేగాక, ఆ ఆర్థిక సంవత్సర కేటాయింపులకు మించకుండా మాత్రమే ఖర్చు చేయాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
గతంలో లక్ష లోపు పనులకు డీపీఓలు, ఆపై పనులకు ఆ పై ఉన్నతాధికారుల అనుమతులు అవసరం ఉండేవన్నారు. ఈ జీవోతో అవేవి అనుమతులు అవసరం లేకుండానే, సంక్రమించే అధికారాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం, తాజాగా ఇచ్చిన జీవోతో దేశంలో ఎక్కడాలేని విధంగా నిర్ణయం తీసుకున్నారని, దీంతో గ్రామాలు మరింత వేంగంగా అభివృద్ధి చెందడానికి వీలు కలుగుతుందని మంత్రి అన్నారు. ఎక్కడ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, నిధుల దుర్వినియోగం జరగకుండా, పనులు నాణ్యంగా జరిగే విధంగా గ్రామ పంచాయతీల బాధ్యులు నడుచుకోవాలని మంత్రి సూచించారు.