నీ ఆత్మరక్షణ కోసం బీజేపీకి తాకట్టు పెట్టినవ్
ఢిల్లీ ముందు మోకరిల్లినవ్
పీఎం, పార్టీ అధ్యక్షుడు అపాయింట్మెంట్ ఇవ్వని దుస్థితి నీది
ఒక్క టీఆర్ఎస్లోనే నీకు గౌరవం దక్కింది lదేశాన్ని నాశనం చేసే బీజేపీలో చేరడం దురదృష్టకరం
పార్టీకి ద్రోహం చేసినవ్.. తగిన గుణపాఠం ప్రజలే చెబుతారు
మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట, జూన్ 14: టీఆర్ఎస్ను వీడిన ఈటల రాజేందర్ ఢిల్లీ ముందు మోకరిల్లాడని, ఆత్మరక్షణ కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బీజేపీలో చేరేందుకు వెళ్తే పీఎం మోదీ, పార్టీ అధ్యక్షుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని దుస్థితి నీదని, కేవలం ఎవరో ఒక అనామకుడితో కండువా కప్పుకుని బీజేపీలో చేరిన నీ ఆత్మ గౌరవం ఎటుపోయింది? అని ప్రశ్నించారు. జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్లో టీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. ఈటల కంటే ముందు ఎందరో నాయకులు ఉద్యమంలో పనిచేశారని, అయినా కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన విషయాలను గుర్తు చేశారు. గౌరవమంటే టీఆర్ఎస్లోనే దక్కిందని, మరెక్కడా నీకు దొరకదన్నారు. ఈ పదవులు, పైసలు ఉద్యమం చలువతోనే వచ్చాయని తెలిపారు.
ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాల రూపకల్పన జరిగింది ప్రగతి భవన్లోనేనని, దాన్ని బానిస భవన్ అనడాన్ని తప్పుబట్టారు. ప్రగతి భవన్ను విమర్శిస్తే ప్రజలను అవమాన పరిచినట్టేనని అన్నారు. వందల ఎకరాల ఆసామి ఈటల రాజేందర్ అని, ఎస్సీ, బీసీల భూములు లాక్కున్న ఫిర్యాదులను వివరించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, ప్రజల ఉసురు పోసుకుంటున్న పార్టీలో ఎలా చేరుతావని అన్నారు. కరోనా సమయంలో టీకాలపై వ్యాపారం చేసే పార్టీ బీజేపీ అని, దేశాన్ని నాశనం చేసే పార్టీలో చేరడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పార్టీకి ద్రోహం చేసిన నీకు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని తెలిపారు. విజన్ ఉన్న నాయకులు సీఎం కేసీఆర్ ఒక్కరేనని, ఆయనను విమర్శిస్తే చూస్తు ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర దూసుకెళ్తున్నదని, ఆయన ఆలోచనా విధానాలను మనం కాపాడుకోవాల్సి బాధ్యత ఉందన్నారు. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థ ముఖ్యమని పేర్కొన్నారు. కేసీఆర్ ఆశయాలను కొనసాగించాలంటే టీఆర్ఎస్ను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.