బోధన్, మే 17: ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి బోధన్ పట్టణంలో ప్రారంభించిన ఇంటింటా సర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించి మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం అన్నారు. పట్టణంలో వార్డుల వారీగా రెండోదఫా ఇంటింటా సర్వేను ప్రారంభించారు. కరోనా కట్టడిలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్తూ.. కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి ముందుగానే మందులు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రామలింగం మాట్లాడుతూ..మొదటి విడుతలో 262 మందికి స్వల్ప లక్షణాలు గుర్తించి మందులు అందజేయడంతో పాటు హోం ఐసొలేషన్ సూచించామన్నారు. రెండో విడుతలో వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటామని చెప్పారు. అవసరమైన వారిని దవాఖానల్లో చేర్పిస్తామని తెలిపారు.
విస్తృతంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే..
ఆర్మూర్, మే 17: ఆర్మూర్లో ఇంటింటి సర్వే జోరుగా సాగుతున్నది. సర్వేను ఆర్మూర్ ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ ఆదముల్ల శైలజ పరిశీలించి సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్వేను పకడ్బందీగా చేపట్టాలని, లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ కొవిడ్ కిట్లను అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ ప్రమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి ఆయేషా ఫిర్దోస్, హెల్త్ సూపర్వైజర్ అనురాధ, సర్వే సిబ్బంది ఉన్నారు.
ఎడపల్లి మండల కేంద్రంలో..
ఎడపల్లి (శక్కర్నగర్), మే 17: ఎడపల్లిలోని నయాబాదిలోని పలు వార్డులతో పాటు గోవింద్పూర్ కొత్త కాలనీలో వైద్యసిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందులను అందజేసి, ఇంట్లోనే ఉండాలని సూచించారు. సర్వేను తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఎంపీడీవో శంకర్ పర్యవేక్షించారు. సర్వే బృందాలకు ప్రజలు సహకరించాలన్నారు. సర్వేలో ఏఎన్ఎం గంగామణి, ఆశ వర్కర్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
మెర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో..
మోర్తాడ్, మే 17: మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో రెండో విడుత ఇంటింటి సర్వే ప్రారంభమయ్యింది. మొదటి విడుతలో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించడంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మోర్తాడ్ మండలం దొన్కల్లో సర్వేను ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్లో కరోనా లక్షణాలు ఉన్న వారి సంఖ్య రెండో విడుత సర్వేలో తగ్గిందని అధికారులు తెలిపారు. గాండ్లపేట్ గ్రామంలో కూడా సర్వేను నిర్వహించారు.
సర్వేపై సమీక్ష..
కోటగిరి/ మే 17 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడుతలో ఇంటింటి జ్వర సర్వే పకడ్బందీగా చేపట్టాలని మండల నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో కార్యదర్శులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ, అశ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి జ్వర సర్వే చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, అశ కార్యకర్తలు పాల్గొన్నారు.
సర్వే పరిశీలన..
వర్ని, మే 17 : కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే వర్ని మండలంలో కొనసాగుతున్నది. కూనిపూర్, జలాల్పూర్ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుతో కలిసి వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఈ సర్వే నిర్వహించారు. సర్వేను ఎంపీడీవో బషీరుద్దీన్ పరిశీలించి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
సంతోష్నగర్ తండాలో..
భీమ్గల్, మే 17: మండలంలోని సంతోష్నగర్ తండాలో కొనసాగుతున్న ఆరోగ్య సర్వేను ఎంపీడీవో రాజేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశాల మేరకు సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సర్వేలో భాగంగా ప్రతిఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేసుకుంటున్నామని తెలిపారు. సర్వే సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు.
ప్రతి రోజూ 50 గృహాలను సందర్శించాలి..
మోర్తాడ్(కమ్మర్పల్లి), మే17: సర్వే బృందాలు ప్రతిరోజూ కచ్చితంగా 50 గృహాలను సందర్శించాలని డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్ సూచించారు. చౌట్పల్లి పీహెచ్సీ పరిధిలో ప్రత్యేకాధికారిని నియమించాలని మంత్రి వేముల సూచించిన నేపథ్యంలో డీప్యూటీ డీఎంహెచ్వో సోమవారం స్వయంగా వచ్చి సర్వే వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రతన్సింగ్, ఆరోగ్యవిస్తరణ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.