కరోనాపై పోరు సాగిస్తున్న పల్లెలు
స్వచ్ఛందంగా లాక్డౌన్
లాక్డౌన్ తర్వాత తగ్గుతున్న కేసులు
క్రమంగా ఇతర గ్రామాల్లోనూ లాక్ డౌన్
మహబూబ్నగర్, మే 4(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): దేశమంతా కరోనా రక్కసి విలయతాండవం చేస్తున్నది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్నిచోట్ల కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. పలుచోట్ల ఈ మహమ్మారి బారిన పడి జనం మృత్యువాత పడుతున్నారు. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. గుంపులు గుంపులుగా సంచరిస్తూ వైరస్ ప్రబలేందుకు కారణం అవుతున్నారు. కొన్ని చోట్ల శుభకార్యాలు ఫంక్షన్ల పేరిట గుమిగూడి మహమ్మారి మరింత విస్తృతమయ్యేలా చేస్తున్నారు. ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించినా… పగటి పూట మాత్రం చాలా చోట్ల జనంలో మార్పు రావడం లేదు. దీనిని అధిగమించేందుకు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని గ్రామాల్లో స్వచ్ఛంద లాక్ డౌన్ విధిస్తున్నారు దీనివల్ల వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాణిజ్య, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. లాక్ డౌన్ కు సహకరించని వారిపై కొన్నిచోట్ల జరిమానా విధించేందుకు గ్రామపంచాయతీలు సిద్ధమవుతున్నాయి.
కరోనా రక్కసిని తరిమేందుకు..
కరోనా రక్కసిని తరిమేందుకు స్వచ్ఛంద లాక్ డౌన్ పాశుపతాస్త్రం గా పనిచేస్తోంది. నారాయణపేట జిల్లా మరికల్ గ్రామంలో గత నెల 26వ తేదీ నుంచి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దుకాణాలు తెరిచి ఉంటున్నాయి ఆ తర్వాత లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. గ్రామంలో కొవిడ్ వల్ల ఇద్దరు మృత్యువాత పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ధన్వాడ మండల కేంద్రంలో గత 13 రోజులుగా లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. లాక్డౌన్కు ముందు సుమారు 20, 30 కేసులు నమోదు అయ్యేవి ప్రస్తుతం ఆ సంఖ్య 2 కు పడిపోయిందని గ్రామస్తులు తెలిపారు. బాలానగర్ మండలం పెద్ద రేవల్లి లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు లాక్డౌన్ కొనసాగుతున్నది. నాగర్కర్నూల్ జిల్లా పదర, వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రాల్లో నేటి నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ విధిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండల కేంద్రంలో నేటి నుంచి లాక్డౌన్ పాటించనున్నారు
గ్రామాల ఆదర్శంగా పట్టణాల్లోనూ..
గ్రామాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ చక్కగా పనిచేస్తుండడంతో పట్టణాల్లోనూ ప్రారంభిస్తున్నారు. మక్తల్ పట్టణంలో గత నెల ఆఖరి వరకు సాయంత్రం 4 గంటల వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్పాటించారు. ఇప్పుడు ఆ సమయాన్ని కుదిస్తూ దుకాణాలు అన్నింటిని మధ్యాహ్నం ఒంటి గంట వరకే క్లోజ్ చేస్తున్నారు. కోస్గి పట్టణంలో మంగళవారం నుంచి లాక్డౌన్ ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్ డౌన్ విధిస్తున్నారు. ఆత్మకూరులో వర్తక, వ్యాపారస్తుల కోరిక మేరకు మున్సిపాలిటీ అధ్వర్యంలో సెల్ఫ్ లాక్డౌన్ విధించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే షాప్ లు తెరుస్తునారు. మధ్యాహ్నం నుంచి తెల్లవారే వరకు లాక్డౌన్ విధించారు. అమరంచింతలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో సెల్ఫ్ లాక్డౌన్ విధించారు. రెండు చోట్ల ఈ నెల 15 వరకు ఈ లాక్డౌన్ పాటిస్తున్నారు. ఈ గ్రామాలను స్ఫూర్తిగా తీసుకుని ఇతర గ్రామాల్లోనూ స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న నారాయణపేట జోగుళాంబ గద్వాల జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తం అవుతున్నారు.