చైనాలో సోమవారం ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. గాలి దుమారం వల్ల సమీపంలోని భవనాలు, రోడ్డుపై వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. రాజధాని బీజింగ్ సహా ఉత్తర చైనాలోని 12 రాష్ర్టాలపై తుఫాన్ ప్రభావం చూపినట్టు అంచనా వేశారు. ప్రభావిత ప్రాంతాల్లో యెల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ మంగోలియాలోని గోబి ఎడారిలో ఈ ఇసుక తుఫాన్ ప్రారంభమైనట్టు జాతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం రాత్రి హుబేయి ప్రొవిన్స్ వరకు చేరుకున్న ఈ ఇసుక తుఫాన్ సోమవారం ఉదయం నాటికి బీజింగ్ సహా పలు ప్రొవిన్స్లకు వ్యాపించినట్టు వివరించింది. గత దశాబ్దకాలంలో ఇదే అత్యంత తీవ్రమైన ఇసుక తుఫాన్గా అభివర్ణించింది.