స్టాక్హోమ్: ఈ యేటి నోబెల్ సాహిత్య అవార్డును గల్ఫ్ నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా గెలుచుకున్నారు. బ్రిటీష్ పాలకుల వల్ల కలిగిన వలసవాదం ప్రభావాలను, గల్ఫ్లో విభిన్న సంస్కృతుల మధ్య నలిగిన శరణార్థుల దీనావస్థలను అబ్దుల్ రజాక్ తన రచనాశైలిలో సుస్పష్టంగా వ్యక్తం చేసినట్లు ఇవాళ స్వీడిష్ అకాడమీ తన ప్రకటనలో తెలిపింది. 1948లో అబ్దుల్ రజాక్ జన్మించారు. జంజీబర్ దీవుల్లో ఆయన పెరిగారు. 1960 దశకంలో ఓ శరణార్థిగా ఆయన ఇంగ్లండ్ చేరుకున్నారు. ఇటీవలే ఆయన రిటైర్ అయ్యారు. క్యాంట్బెరీలోని కెంట్ యూనివర్సిటీలో ఇంగ్లష్ అండ్ పొస్ట్ కొలోనియల్ లిటరేచర్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు. అబ్దుల్రజాక్ మొత్తం పది నవలలను రాశారు. ఇంకా ఎన్నో చిన్న కథలను పబ్లిష్ చేశారు. ఓ శరణార్థి ఎలా నలిగిపోయాడో తన రచనాశైలితో ఆకట్టుకున్నారు. 21 ఏళ్ల నుంచి ఆయన రైటింగ్ ప్రారంభించారు. ఆయన తొలి భాష స్వాహిలి. కానీ తన సాహిత్య ప్రక్రియకు మాత్రం ఆయన ఇంగ్లీష్ను ఎంచుకున్నారు.
1994లో అబ్దుల్రజాక్ ప్యారడైజ్ అనే నవల రాశారు. అది ఆయనకు నాల్గవది. ఆ నవలతో ఆయన పాపులర్ రైటర్గా మారారు. 1990లో ఈస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన ఆయన ఆ నవలలో ఆ ట్రిప్ గురించి రాశారు. భిన్నమైన విశ్వాసం కలిగిన వ్యక్తుల ఓ విషాద ప్రేమకథను చెప్పారు. శరణార్థి అనుభవాలను తన నవల్లో గుర్నా అద్భుతంగా ఆవిష్కరించారు. ఐడెంటీ, సెల్ఫ్ ఇమేజ్పైనే ఆయన తన కథలతో దృష్టి పెట్టారు. సంస్కృతులు, ఖండాల మధ్య ఉన్న తేడాలతో క్యారెక్టర్లు ఆసక్తికరంగా మారుతాయి. అభద్రతాభావంలో ఉన్నవారి జీవితాలు ఎలా ఉంటాయో ఆయన తన రచనా శైలితో ప్రస్పుటం చేశారు.
సాంప్రదాయరీతులకు తన రచనలతో బ్రేకప్ చెప్పారు. వలసవాద శైలికి భిన్నంగా రచనలు సాగించారు. 2005లో రాసిన డిసెర్షన్ నవల ఓ పెద్ద హిట్. ఆ నవల కూడా ఓ లవ్ అఫైర్కు చెందినదే. కానీ రాచరిక రొమాన్స్ ఎలా ఉంటుందో ఆయన ఆ నవల ద్వారా వెల్లడించినట్లు విశ్లేషకులు చెప్పారు. గుర్నా సాహిత్యం నిరంతరం దశలు మారుతూనే ఉంటుందని స్వీడిష్ అకాడమీ తన ప్రకటనలో తెలిపింది. ఆయన రచనల్లో జ్ఞాపకాలు, పేర్లు, గుర్తులు నిత్యం మారుతూనే ఉంటాయన్నది. ఆయన పుస్తకాల్లో అంతం లేని విజ్ఞానాన్వేషణ ఉంటుందని అకాడమీ పేర్కొన్నది. 2020లో రాసిన ఆఫ్టర్లైవ్స్ నవలలోనూ అబ్దుల్రజాక్ రచనా ప్రావీణ్యం ఏమాత్రం తగ్గలేదని స్విడిష్ అకాడమీ వెల్లడించింది. సత్యానికి గుర్నా కట్టుబడి ఉన్న తీరు అద్భుతమన్నది. మూసధోరణికి గుడ్బై చెప్పిన గుర్నా.. తన రచనలతో ఈస్ట్ ఆఫ్రికా సాంస్కృతికి వైరుధ్యాలను అనర్గళంగా చెప్పినట్లు అకాడమీ అభిప్రాయపడింది.