న్యూఢిల్లీ : కొవిడ్-19 కేసుల వ్యాప్తితో దేశవ్యాప్త లాక్డౌన్ ( Lock down ) విధించాలని అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) చేపట్టిన ఆన్ లైన్ సర్వేలో 67 శాతం మంది నొక్కిచెప్పారు. కరోనా మహమ్మారి కట్టడికి తక్షణమే దేశమంతటా లాక్డౌన్ అమలు చేయాలని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ ఖండేల్వాల్.. ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ణప్తి చేశారు. వైరస్ చైన్ ను బ్రేక్ చేసేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ సాధ్యం కాని పక్షంలో కొవిడ్-19 కేసులు అత్యధికంగా వెలుగు చూస్తున్న రాష్ట్రాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని కోరారు.
జాతీయ లాక్డౌన్ అమలైతే గత ఏడాది మాదిరిగానే దేశమంతటా పేదలకు నిత్యావసరాలను వర్తకులు, వాణిజ్యవేత్తలు సమకూరుస్తారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తాము చేపట్టిన సర్వేలో 9000 మందికి పైగా పాల్గొన్నారని వీరిలో 67.5 శాతం మంది కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ కు మొగ్గుచూపారని చెప్పారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ నియంత్రించలేని విధంగా మారిందని 78.2 శాతం మంది అభిప్రాయపడ్డారని వెల్లడించారు.