వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్
మామిళ్లగూడెం, ఏప్రిల్ 9 : జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 2వేల నగదు, 25 కేజీల బియ్యం అందించేందుకు ముఖ్యమంత్రి ప్రకటించిన పథకం అమలుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్పరెన్స్లో వివరాలు వెల్లడించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేటు పాఠశాలలో టీచింగ్, నాన్టీచింగ్ వివరాలు సేకరించి ఈ నెల 16లోగా సమగ్ర నివేదికను అందజేస్తామని తెలిపారు. జిల్లాలో గుర్తింపు పొందిన 300 పాఠశాలలో 3619 మంది టీచింగ్, 127 మంది నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారని ప్రాథమిక అంచనా వేయడం జరిగిందని వెంటనే పూర్తి స్థాయి వివరాలను సేకరించి నిర్ధేశించిన గడువులో అందజేస్తామని తెలిపారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కొవిడ్ 19 కారణంగా గత ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలలో ఉపాద్యాయులు, సిబ్బంది వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు రూ. 2వేల నగదు, 25 కేజీల బియ్యం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు.
ప్రైవేటు పాఠశాలలో టీచింగ్, నాన్టీచింగ్ వారు ఆధార్, బ్యాంకు ఖాతా, రేషన్ కార్డుల వివరాలు నిర్దేశించిన పట్టికలో సమగ్ర డేటాను ఈ నెల 16లోగా అందించాలన్నారు. 17వ తేదిన రాష్ట్ర స్థాయిలో పరిశీలన పూర్తి చేసి ఆన్లైన్ ద్వారా నేరుగా సిబ్బంది ఖాతాలో రూ. 2వేల నగదును జమ చేసే ప్రక్రియ ఈ నెల 20వ తేదిన చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. రేషన్ షాపుల ద్వారా 25 కేజీల బియ్యాన్ని అందిస్తామని తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రైవేటు టీచర్లను ఆదుకున్న ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అన్నారు. పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం అయ్యేంత వరకు ఈ 25 కేజీల బియ్యం అందించేందుకు రాష్ట్రంలో ఫైన్ రైస్ నిల్వలు సరిపోను ఉన్నాయన్నారు. అవసరమైతే అదనపు కేటాయింపులు చేస్తామని విద్యాశాఖ, పౌరసరఫరాల సంయుక్త సహకారంతో సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్ధ్దం చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జిల్లా ఇన్చార్జీ డీఈఓ చావా శ్రీనివాస్, ఎస్ఎఓ కిశోర్, డీఎస్ఓ రాజేందర్, సివిల్ సప్లయ్ మేనేజర్ సోములు తదితరులు పాల్గొన్నారు.