వ్యవసాయ యూనివర్సిటీ : ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటామని, దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రాజేంద్ర నగర్లోని ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిబంధనలు పాటిస్తున్నప్పటికీ , సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతుకు అండగా నిలుస్తున్నామన్నారు. గతంలో పేరుకు మాత్రమే డీసీఎంఎస్ కొనసాగేదని, ఏడేండ్ల్లుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది రూ. 5 కోట్ల 11 లక్షల వ్యాపారం జరిగిందన్నారు. అన్నీ పోనూ రూ. 12 లక్షల 67వేలు సంస్థకు లాభం చేకూరిందన్నారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లా రైతాంగానికి రూ. 447.74 లక్షల విలువ గల రసాయన ఎరువులు పంపిణీ చేశామన్నారు. శాశ్వత ప్రాతిపదికపై చౌకధర దుకాణాల ద్వారా వికారాబాద్ ,తాండూర్ నియోజకవర్గాల్లో రూ. 1.56 లక్షల విలువ గల కంది పప్పు పంపిణీ చేశారన్నారు. 6800 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంచేందుకు అవకాశం ఉందన్నారు . తాండూర్ , ఇబ్రహీంపట్నం, శంకర్పల్లి , వికారాబాద్ లలోని దుకాణాలు అద్దెకు ఇవ్వడం వల్ల రూ. 64.02 లక్షల ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. జిల్లాలో మూడు ప్రధానమైన రైస్ మిల్లులున్నాయని వాటి ద్వారా రూ 38.31 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. ఇటీవల శాసన సభలో సీఎం కేసీఆర్ ప్రకటించిన అంశాలపై సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి, ఉపాధ్యక్షులు మధుకర్రెడ్డి, సభ్యులు మల్లారెడ్డి, పాండు యాదవ్, సర్సింహులు , యాదయ్య గౌడ్, శంకరయ్య పాల్గొన్నారు.