గాజా: ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య మళ్లీ ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. గత అయిదు రోజుల నుంచి ఆ రెండు దేశాలు రాకెట్ల దాడితో బీభత్సం సృష్టిస్తున్నాయి. గాజాలో ఉన్న పాలస్తీనా ఉగ్రవాదులు ఇప్పటి వరకు సుమారు రెండు వేల రాకెట్లతో దాడి చేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం సుమారు 220 ప్రాజెక్టైల్స్తో దాడి చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. అయితే దాంట్లో 30 రాకెట్లు బోర్డర్ దాటలేకపోయినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. డజన్ల సంఖ్యలో దూసుకువస్తున్న రాకెట్లను ఐరన్ డోమ్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంటోందని ఐడీఎఫ్ వెల్లడించింది. గురువారం రాత్రి జరిగిన దాడిలో ఒకరు మృతిచెందారు.
ఇక గాజా నగరంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళం పేర్కొన్నది. గాలిలోకి ఎగిరిన సుమారు 145 విమానాలు.. ఒకేసారి హమాస్ ఉగ్రవాద గ్రూపుకు చెందిన టన్నెళ్లపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గత అయిదు రోజుల్లో తాము చేసిన అతిపెద్ద దాడి ఇదే అని ఐడీఎఫ్ చెప్పింది. వైమానిక దళం నిర్వహించిన దాడి సుమారు 40 నిమిషాల పాటు సాగింది. నార్తర్న్ గాజాలో ఉన్న 150 టార్గెట్లపై 450 మిస్సైళ్లు కురిపించినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. హమాస్ ఇంటలిజెన్స్ కేంద్రాలపై జరిగిన దాడిలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఇజ్రాయిల్ రక్షణ శాఖ చెప్పింది. హమాస్కు చెందిన అండర్ గ్రౌండ్ మౌళికసదుపాయాలను దెబ్బతీసినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది.
వైమానిక దళాలకు తోడుగా.. ఇజ్రాయిల్ ట్యాంకులు, ఆర్టిల్లరీ సామాగ్రి, సాయుధ బలగాలు.. గాజా బోర్డర్ వద్ద భీకర కాల్పులు జరిపారు. గాజా సరిహద్దు వద్ద తమ సైనిక దళాలు ఉన్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఇజ్రాయిల్ గంటకు పైగా దాడి చేసిందని, ఆ దాడుల్లో అనేక మంది మరణించినట్లు పాలస్తీనా వెల్లడించింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మిస్సైల్ దాడి చేశామని ఐడీఎఫ్ ప్రతినిధి జిల్బర్మ్యాన్ తెలిపారు. సోమవారం నుంచి జరుగుతున్న హింసలో .. ఇజ్రాయిల్కు చెందిన 9 మంది మరణించారు. ఇక గాజాలో 119 మంది మరణించినట్లు తెలుస్తోంది.