తూప్రాన్ రూరల్/రామాయంపేట్: వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు రైతులు, చిరు వ్యాపారులు అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధిలోని అల్లాపూర్ టోల్ప్లాజా వద్ద రూ.1.60 కోట్లతో నిర్మించిన రైతు బజార్ను, చిరు వ్యాపారులు విక్రయించడానికి , కూరగాయలను కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ట్యాంకును శుక్రవారం జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి, ఎమెల్సీ శేరిసుభాశ్రెడ్డి, కలెక్టర్ హరీశ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆధునాతన పద్ధతుల్లో నిర్మించిన రైతు బజార్లో వివిధ రకాలైన పండ్లు,కూరగాయలు, మక్కబుట్టలు, వేరుశనగలు, టీస్టాళ్లను పెట్టుకునేందుకు 50 మంది వరకు అవకాశం ఉంటుందన్నారు. ఈ స్టాళ్లను ఎవ్వరికి కేటాయించలేదని, ముందుగా వచ్చి కూర్చున్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రైతులు, చిరువ్యాపారులు సైతం ఇక్కడే కూరగాయలను విక్రయించుకోవాలన్నారు. అవసరమైతే మరిన్ని షెడ్లను నిర్మించి ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక నుంచి రోడ్లపై విక్రయించకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాలు, కూరగాయలకు సరైనా మద్ధతు ధరను కల్పించడం కోసమే వ్యవసాయ మార్కెట్ యార్డులు, రైతు బజార్లను సీఎం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.