కాబూల్, ఆగస్టు 4: భారత్-ఆఫ్ఘనిస్తాన్ స్నేహానికి చిహ్నంగా పేరుగాంచిన సల్మా డ్యాంను పేల్చడానికి తాలిబన్లు ప్రయత్నించారు. ఈ దాడిని ఆఫ్ఘన్ బలగాలు తిప్పికొట్టడంతో డ్యాంకు ఏమీకాలేదు. భారత్ సహకారంతో ఆఫ్ఘనిస్తాన్లో ఈ డ్యాంను నిర్మించారు. అయితే ఇది గిట్టని తాలిబన్లు గతంలో కూడా డ్యాంను రాకెట్లతో పేల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా మంగళవారం రాత్రి కూడా డ్యాంపై దాడికి యత్నించారు. అప్రమత్తమైన ఆఫ్ఘన్ బలగాలు ప్రతిదాడికి దిగడంతో తాలిబన్లు పారిపోయారు.