కాబూల్, సెప్టెంబర్ 6: సింహాల గడ్డ పంజ్షీర్లో యుద్ధం ముగిసింది. ఎనిమిది రోజులగా జరిగిన హోరాహోరీ పోరులో తాలిబన్లదే పైచేయి అయింది. ఆదివారం రాత్రి వందలాది వాహనాల్లో పంజ్షీర్పైకి దండెత్తిన వేలాది మంది తాలిబన్లు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకొన్నారు. ‘పంజ్షీర్లో యుద్ధం ముగిసింది. ఇక సుస్థిరమైన అఫ్గానిస్థాన్ను ఆకాంక్షిస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు ఎవరు చేతబట్టినా వారు అఫ్గాన్ ప్రజలకు, దేశానికి శత్రువులు’ అని తాలిబన్ సీనియర్ నేత జబియుల్లా ముజాహిద్ సోమవారం ప్రకటించాడు. చొరబాటు దారులు దేశాన్ని పునర్నిర్మించలేరని అఫ్గాన్ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరాడు. దేశ నిర్మాణం అఫ్గాన్ పౌరుల బాధ్యతేనన్నాడు. అఫ్గాన్ జాతీయ ప్రతిఘటన దళం(ఎన్ఆర్ఎఫ్ఏ)తో శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించామని, వాళ్లు అంగీకరించలేదని పేర్కొన్నాడు. పంజ్షీర్ ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని జబియుల్లా హామీ ఇచ్చాడు. ‘పంజషీర్ ప్రజలపై ఎలాంటి వివక్ష ఉండదు. వారంతా మా సోదరులు. ఉమ్మడి లక్ష్యం కోసం మేమంతా కలిసి పనిచేస్తాం. వారికి విశ్వాసం కల్పిస్తాం’ అని అన్నాడు.
ఇప్పటికీ క్షమిస్తాం
కాబూల్ నుంచి పారిపోయిన కొంతమంది తాలిబన్లపై పోరాటం చేయగలమని ఇంకా భావిస్తున్నారని, ఎవరైనా సమస్యలు సృష్టించాలని ప్రయత్నిస్తే పంజ్షీర్ తరహాలోనే దారిలోకి తీసుకొస్తామని జబియుల్లా హెచ్చరించాడు. పంజ్షీర్ స్వాధీనంలో పౌరులెవరూ చనిపోలేదని తెలిపాడు. అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, ఎన్ఆర్ఎఫ్ఏకు నేతృత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ తజికిస్థాన్కు పారిపోయినట్టు జబియుల్లా ముజాహిద్ చెప్పారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన వారిని ఇప్పటికీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నాడు. పంజ్షీర్లో విద్యుత్తు, ఇంటర్నెట్ను త్వరలోనే పునరుద్ధరిస్తామని జబియుల్లా చెప్పాడు. ఇదిలా ఉండగా, గత అఫ్గాన్ ప్రభుత్వ బలగాల్లో పనిచేసిన సైనికులను తాలిబన్లతో కలిసి పనిచేయాలని కోరినట్టు వివరించాడు.
పోరాటం కొనసాగుతుంది
తమ పోరాటం కొనసాగుతుందని ఎన్ఆర్ఎఫ్ఏకు నేతృత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ తెలిపారు. తాలిబన్లపై దేశవ్యాప్త తిరుగుబాటుకు పిలుపునిచ్చారు. సోమవారం మసూద్ ఫేస్బుక్ పేజీ ద్వారా పౌరులకు సందేశాన్నిచ్చారు. తాను సురక్షితంగానే ఉన్నానని చెప్పారు. పంజ్షీర్పై దాడిలో తాలిబన్లకు పాకిస్థాన్ నేరుగా సాయం చేసిందని, దీన్ని అంతర్జాతీయ సమాజం మౌనంగా చూస్తూ ఊరుకొన్నదని ఆరోపించారు. మరోవైపు, ఆదివారం యుద్ధంలో ఎన్ఆర్ఎఫ్ఏ అధికార ప్రతినిధి ఫాహీం దాస్తీ చనిపోయాడు.
బల్ఖ్ ప్రావిన్స్లో విమానాలు
అఫ్గాన్లోని బల్ఖ్ ప్రావిన్స్లో పౌరుల తరలింపునకు ఉద్దేశించిన నాలుగు విమానాలు మజర్ ఈ షరీఫ్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ కావడం లేదు. చాలా రోజులుగా అక్కడే ఉన్నాయి. విమానాలు టేకాఫ్ కాకుండా తాలిబన్లే అడ్డుకొంటున్నారని రిపబ్లికన్ నేత మైకేల్ మెక్ కాల్ ఆరోపించారు. విమానాల్లో అమెరికన్లు కూడా ఉన్నారని, వారిని తాలిబన్లు బందీలు చేశారని విమర్శించారు. విమానాలను వదిలేసేలా తాలిబన్లను ఒప్పించాలని అమెరికాపై ఒత్తిడి పెరుగుతున్నది. అయితే, విమానాల్లో ఉన్న వారికి ఎలాంటి పాస్పోర్టులు, వీసాలు లేవని, అందుకే దేశాన్ని విడిచివెళ్లలేకపోతున్నారని ఎయిర్పోర్టులో అధికారి ఒకరు తెలిపారు.
త్వరలోనే ప్రభుత్వం
అఫ్గాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు వాయిదా పడుతూ వస్తున్నది. పంజ్షీర్పై ఇంకా పట్టు చిక్కకపోవడమే వాయిదాలకు కారణం అని భావిస్తున్నారు. తాజాగా పంజ్షీర్ తాలిబన్ల వశం అయిన నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని పలువురు భావిస్తున్నారు. తాలిబన్లకు అఫ్గానిస్థాన్ ఆక్రమణ ఒక ఎత్తు అయితే.. పంజ్షీర్ ప్రావిన్స్ స్వాధీనం మరొక ఎత్తు అయింది. ఎనిమిది రోజులు హోరాహోరీ యుద్ధం తర్వాత పంజ్షీర్ వారికి చిక్కింది.
అఫ్గాన్ పరిణామాలపై మోదీ సమీక్ష
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ పరిణామాలపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అఫ్గాన్లో నెలకొన్న పరిస్థితులు, తాలిబన్ల నాయకత్వంపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.
పరదా చాటున విద్య
అప్గానిస్థాన్లో కొన్ని రాష్ర్టాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తెరుచుకొన్నాయి. తరగతి గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకుండా మధ్యలో పరదాలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీల్లో చదివే యువతులు తప్పకుండా నిఖాబ్ ధరించాలని తాలిబన్లు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.