కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్కు 90 మైళ్ల దూరంలోని నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్పై పట్టు కోసం తాలిబన్, ఐఎస్కేపీ మధ్య ఫైట్ జరుగుతున్నది. తాజాగా శనివారం జరిగిన బాంబు పేలుడులో ఒక వ్యక్తి మరణించగా ఏడుగురు గాయపడ్డారు. కాగా, చనిపోయిన వ్యక్తి తాలిబన్ సభ్యుడని స్థానిక మీడియా తెలిపింది. తాలిబన్ కాన్వాయ్ వెళ్తుండగా రోడ్డు పక్కన అమర్చిన మందుపాతరను పేల్చారు. అయితే ఇది తమ పనేనని ఎవరూ వెల్లడించలేదు. కాగా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఐఎస్కేపీ పనిగా అనుమానిస్తున్నారు.
తూర్పు ఆఫ్ఘనిస్థాన్పై తన పట్టును నిలుపుకునేందుకు ఐఎస్కేపీ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లు, కాల్పులకు పాల్పడుతున్నది. గురువారం ఐఎస్కేపీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒకరు కారుపై జరిపిన కాల్పుల్లో నలుగురు తాలిబన్లు చనిపోయారు. మరణించిన వారి చేతులు కట్టేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు.
మరోవైపు బుధవారం జలాలాబాద్లో జరిగిన పేలుడులో ఇద్దరు తాలిబన్లతో సహా ఐదుగురు మరణించారు. దీనికి ముందు జరిగిన బాంబు పేలుళ్లలో ఇద్దరు తాలిబన్లతో సహా ముగ్గురు మరణించగా 19 మంది గాయపడ్డారు. జలాలాబాద్లో వరుస బాంబు దాడుల నేపథ్యంలో తాలిబన్లు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు.