న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో ఇళ్లు ఇళ్లు గాలిస్తున్న తాలిబన్లు ( Taliban ).. అక్కడ ఉన్న భారత కాన్సులేట్లను కూడా తనిఖీ చేశారు. కాందహార్, హీరత్ నగరాల్లో ఉన్న భారతీయ దౌత్యకార్యాలను బుధవారం తాలిబన్లు ముట్టడించినట్లు తెలుస్తోంది. ఆ కార్యాలయాల్లో ఉన్న పేపర్లను, పార్క్ చేసిన కార్లను తీసుకువెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రెండు కాన్సులేట్లలో ఉన్న అన్ని వస్తువుల్ని వాళ్లు పరిశీలించారు. గత ఆదివారం కాబూల్ను చేజిక్కించుకున్న తాలిబన్లు.. ఆ నగరంలో డోర్ టు డోర్ తనిఖీ చేపడుతున్నారు. జాతీయ భద్రత విభాగం కోసం పనిచేసిన వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్లో భారత్కు చెందిన నాలుగు దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. కాబూల్లో అదనంగా మరో ఎంబసీ ఉన్నది. కాందహార్, హీరత్తో పాటు మజార్ యే షరీఫ్ పట్టణంలోనూ భారతీయ కాన్సులేట్ ఉంది. అయితే తాలిబన్ మిలిటెంట్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొన్ని రోజుల ముందే మజార్ యే షరీఫ్ కాన్సులేట్ను మూసివేశారు. మూడు రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి సుమారు 200 మంది దౌత్య సిబ్బందిని తరలించినట్లు రాయబారి రుద్రేంద్ర టండన్ తెలిపారు.