న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఏ దేశానికి హాని ఉండదని తాలిబన్లు ప్రకటించారు. అమెరికా సారధ్యంలోని పశ్చిమ దేశాల సేనలు దేశాన్ని వీడగానే తాలిబన్ల దాడితో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్ప కూలిన సంగతి తెలిసిందే. అమెరికాతో సహా ప్రపంచ దేశాల రాయబార కార్యాలయాలు ఆఫ్ఘన్ నుంచి ఖాళీ చేస్తున్న నేపథ్యంలో తాలిబన్ల అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ మంగళవారం కాబూల్లో మీడియాతో మాట్లాడారు.
“ఆఫ్ఘన్ నుంచి ఏ దేశానికి ముప్పు వాటిల్లదని ప్రపంచ దేశాలకు ప్రపంచ దేశాలకు ఇస్లామిక్ ఎమిరేట్స్ ప్రతిజ్ఞ చేస్తున్నది” అని చెప్పారు. యుద్ధానికి ముగింపు పలుకాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. అన్ని వైపులా, అందరితో సంబంధాలు నెలకొల్పుతామన్నారు. తాము అంతర్గతంగా, బహిర్గతంగా ఎటువంటి శత్రువులను కోరుకోవడం లేదని చెప్పారు.
మహిళల పట్ల ఎటువంటి వివక్ష ఉండబోదన్నారు. ఇస్లాం సిద్ధాంతాల ఆధారితంగా మహిళలకు హక్కులు కల్పించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్యం, ఇతర రంగాల్లో అవసరమైన రంగాల్లో మహిళలు పని చేయొచ్చునన్నారు.