కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి చెలరేగిపోతున్నారు. ఆ దేశం నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత పలు సరిహద్దు జిల్లాలపై దాడులు చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలపై ఆంక్షలు, కఠిన నిబంధనలు విధించడంతోపాటు అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా తూర్పు ఆఫ్ఘనిస్థాన్లోని పక్తియా ప్రావిన్స్లో ప్రసిద్ధ గురుద్వారా వద్ద సిక్కు మత జెండాను తాలిబన్లు తొలగించారు. చమ్కని ప్రాంతంలోని గురుద్వారా థాల సాహిబ్ పైకప్పు పైనుంచి నిషాన్ సాహిబ్ను తీసివేశారు. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ సందర్శించిన ఈ చారిత్రక గురుద్వారా పట్ల అపవిత్రంగా వ్యవహరించారు.
గత ఏడాది జూన్లో స్థానిక సిక్కు నేత నిదాన్ సింగ్ సచ్దేవ్ను తాలిబన్లు కిడ్నాప్ చేశారు. సిక్కు మత పెద్దలు, ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రయత్నాల వల్ల చివరకు ఆయనను విడిచిపెట్టారు. దీనికి ముందు గత ఏడాది మార్చి 25న కాబుల్లోని గురుద్వారాలో జరిగిన ఉగ్రదాడిలో 30 మంది సిక్కులు మరణించారు.