కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తమ గుప్పిట్లోకి వచ్చినా.. ఆ ఒక్క ప్రాంతాన్ని తాలిబన్లు ఇప్పటికీ జయించలేకపోయారు. ఇప్పుడే కాదు గత రెండున్నర దశాబ్దాలుగా ఆ ప్రాంతం తాలిబన్లకు మింగుడుపడనిదే. ఆ ప్రాంతం పేరు పంజ్షిర్( Panjshir ). దేశ సైన్యమంతా లొంగిపోయి, అధ్యక్షుడు పారిపోయినా.. ఈ ప్రాంతంలోని వాళ్లు మాత్రం తాలిబన్లపై తిరుగుబాటు చేస్తున్నారు. ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కూడా ఇక్కడి వారితో చేయి కలిపి తాలిబన్లపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు.
అలాంటి ప్రాంతంపై ఇప్పుడు తాలిబన్లు దాడికి సిద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలోని తిరుగుబాటుదారులు లొంగిపోవాల్సిందిగా నాలుగు గంటల సమయం ఇచ్చారు తాలిబన్లు. ఈ విషయాన్ని పంజ్షిర్ ప్రావిన్స్ ట్విటర్ హ్యాండిల్ వెల్లడించింది. అయితే తాలిబన్ల బెదిరింపులకు భయపడేది లేదని, ఎంత మంది వచ్చి దాడి చేసిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ తిరుగుబాటుదారుడు చేసిన ప్రకటన వీడియోను కూడా ఈ పంజ్షిర్ ప్రావిన్స్ షేర్ చేసింది.