పెషావర్, సెప్టెంబర్ 2: తాలిబన్ అగ్రనేత ముల్లా హెబతుల్లా అఖూంజాదా పర్యవేక్షణలో అఫ్గానిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తమ ప్రభుత్వం ఏర్పాటుపై సంప్రదింపులు పూర్తయ్యాయని, క్యాబినెట్ కూర్పుపైనా చర్చ జరిగిందని తాలిబన్ల సమాచార కమిషన్ ఉన్నతాధికారి ముఫ్తీ ఇనాముల్లా సమంగానీ తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన వెలువడుతుందని తెలిపారు. ఇరాన్లో ఉన్న ప్రభుత్వ నిర్మాణం మాదిరిగానే అఫ్గాన్లో తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. సమంగానీ చెప్పినదాన్ని బట్టి.. తాలిబన్ ప్రభుత్వంలో సుప్రీం లీడర్గా అత్యంత ఉన్నత స్థాయిలో అఖూంజాదా(60) ఉంటారు. ఆయన తర్వాతి స్థానం దేశాధ్యక్షుడిది.
రెండు రోజుల్లో విమాన సర్వీసులు
తాలిబన్ల ప్రభుత్వంలో మహిళలు, అన్ని గిరిజన తెగలకు భాగస్వామ్యం ఉంటుందని దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయం డిప్యూటీ లీడర్ మహ్మద్ అబ్బాస్ స్తానిక్జాయ్ తెలిపారు. గడిచిన 20 ఏండ్లలో అఫ్గాన్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారెవరూ ప్రస్తుత ప్రభుత్వంలో ఉండరన్నారు. కాబూల్లోని ఎయిర్పోర్టులో విమాన సర్వీసులను రెండు రోజుల్లో పునరుద్ధరిస్తామని చెప్పారు.
‘బాగ్రం’ స్వాధీనానికి చైనా యత్నాలు: నిక్కీ హేలీ
అఫ్గానిస్థాన్లోని బాగ్రం వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవాలని చైనా ప్రయత్నిస్తున్నదని అమెరికా మాజీ సీనియర్ దౌత్యవేత్త నిక్కీ హేలీ తెలిపారు. అలాగే భారత్కు వ్యతిరేకంగా బలపడేందుకు పాకిస్థాన్ను వాడుకునేందుకు చూస్తున్నదని పేర్కొన్నారు.
అల్ఖైదాతో కలిసి పంజ్షీర్పై తాలిబన్ల దాడి
పంజ్షీర్ను చేజిక్కించుకోవడంలో తాలిబన్లకు అల్ఖైదా ఉగ్రవాదులు సాయపడుతున్నారు. అహ్మద్ మసూద్ నేతృత్వంలోని పంజ్షీర్ బలగాలు, తాలిబన్లకు మధ్య రెండు రోజులుగా పోరాటం సాగుతున్నది. ఇరువైపులా ప్రాణనష్టం సంభవిస్తున్నట్టు తాలిబన్లు చెప్పారు.