కాబూల్: తాను చనిపోలేదని, క్షేమంగానే ఉన్నానని, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, ఉప ప్రధానిగా నియమితమైన ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ తెలిపారు. తాను మరణించినట్లు వస్తున్న పుకార్లను తోసిపుచ్చుతూ ఒక ఆడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. ‘నా మరణం గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. గత కొన్ని రాత్రులు నేను పర్యటనలకు దూరంగా ఉన్నాను. ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నా, నా సోదరులు, స్నేహితులతో సహా అంతా క్షేమంగా ఉన్నాము’ అని బరదార్ తెలిపారు. ‘మీడియా ఎప్పుడూ నకిలీ వార్తలు ప్రచారం చేస్తుంది. అందువల్ల, ఆ అబద్ధాలన్నింటినీ ధైర్యంగా తిరస్కరించండి. మాకు ఎలాంటి సమస్య లేదని నేను మీకు వంద శాతం ధృవీకరిస్తున్నాను’ అని ఆడియో క్లిప్లో పేర్కొన్నారు.
కాగా, ఆఫ్ఘనిస్థాన్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైందనట్లు తెలుస్తున్నది. ముల్లా హసన్ అఖుంద్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా, బరదార్ను డిప్యూటీగా నియమించిన తర్వాత తాలిబన్లో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో డిప్యూటీ ప్రధాని బరదార్ గాయపడటం లేదా మరణించి ఉంటారని లేదా కరోనా బారిన పడి ఉంటారన్న వదంతులు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో తాను బతికే ఉన్నానని ధ్రవీకరించడం కోసం బరదార్ ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తాలిబన్ దీనిని తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.