కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ నివాసంలో 6.5 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.47.5 కోట్లకుపైగా) నగదు, 18 బంగారు ఇటుకలు లభ్యమయ్యాయని తాలిబన్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తాలిబన్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల పంజ్షీర్లో నేషనల్ రెజిస్టెన్స్ ఫ్రంట్తో (ఎన్ఆర్ఎఫ్) పోరులో భాగంగా తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా అజీజీని హత్యచేశారు. అయితే ఎన్ఆర్ఎఫ్ నాయకుడు అహ్మద్ మసూద్, అమృల్లా సలేహ్ జాడ మాత్రం తాలిబన్లకు ఇప్పటివరకు లభ్యంకాలేదు.
గత 20 ఏండ్లుగా అమెరికా మద్దతుతో కొనసాగుతున్న ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు గత నెలలో కూల్చేశారు. ఆగస్టు 15న కాబూల్లోని అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆప్ఘనిస్థాన్లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వ పతనం సంపూర్ణం అయ్యింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 7న తాలిబన్లు కొత్త క్యాబినెట్కు రూపకల్పన చేశారు. తాలిబన్ నేత ముల్లా మహమ్మద్ హసన్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కొలువుదీర్చారు. మరో నాయకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ను ముల్లా మహమ్మద్కు డిప్యూటీగా ఎన్నుకున్నారు.