కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు చెలరేగిపోతున్నారు. చారిత్రక బమియన్లోని హజారా నాయకుడు అబ్దుల్ అలీ మజారి విగ్రహాన్ని బాంబులతో పేల్చివేశారు. హజరాజత్ అని పిలిచే ఆఫ్ఘనిస్థాన్ పర్వత మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమైన ఒక జాతి సమూహమే హజారాలు. మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు చెంఘిజ్ ఖాన్ వారసులు వీరు. 13వ శతాబ్దంలో మంగోల్ సైనికులు ఈ ప్రాంతాన్ని చుట్టిముట్టి స్వాధీనం చేసుకున్నారు.
హజారాలు ప్రధానంగా షియా ముస్లింలు. ఆఫ్ఘనిస్థాన్లోని సున్నీ ముస్లిం మిలిటెంట్ గ్రూపులు మైనారిటీలైన షియాలపై పదేపదే దాడులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హజారాలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. హజారా నాయకుడు అబ్దుల్ అలీ మజారీ తాలిబాన్లకు వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో 1995లో తాలిబన్లు ఆయనను కిడ్నాప్ చేశారు. మజారీని ఉరి తీసి గజ్నీలో హెలికాప్టర్ నుంచి మృతదేహాన్ని వేలాడదీశారు.
ఆఫ్ఘనిస్థాన్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబన్లు 1995లో తాము హత్య చేసిన బమియన్లోని మజారీ విగ్రహాన్ని ఇటీవల బాంబులతో పేల్చివేశారు. 2001లో తాలిబన్ నాయకుడు ముల్లా మహమ్మద్ ఒమర్ ఆదేశాలతో బమియన్లోని ప్రసిద్ధ బుద్ధుడి విగ్రహాన్ని తాలిబన్లు పేల్చివేసిన ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది.
మరోవైపు హజారా జాతికి చెందిన బల్ఖ్ ప్రావిన్స్లోని చాహర్కింట్ జిల్లా మహిళా గవర్నర్ సలీమా మజారిని తాలిబన్లు తమ కస్టడీలోకి తీసుకున్నారు. హజారా వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి.