చిత్రకారులు వారి కుంచెలతో అత్యద్భుత వైవిధ్యంతో కూడుకున్న చిత్రాలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. వారి సృజనాత్మక భావాలు, ఆలోచనల మేళవింపుగా నిలిచిన అందమైన కళాకృతులు సందర్శకులకు ప్రధాన ఆకర్శణగా నిలిచాయి. దేవుళ్లు, దేవతా మూర్తులు, పల్లె జీవన విధానం, ప్రకృతి రమణీయత, సంగీత వాయిద్యాలు, సందేశాత్మక కళా ఖండాలు, ఇలాంటి విభిన్న రకాల చిత్రాలు సోమవారం రవీంద్రభారతి ఆర్ట్ గ్యాలరీలో కొలువు దీరాయి. కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ పక్షాన తెలుగు వారి అత్యంత ప్రీతిపాత్రమైన ఉగాది పండుగ సందర్భంగా చిత్రకళ ప్రదర్శనకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీకారం చుట్టారు. చిత్రకారులు గాయత్రి, దివ్య, ప్రసన్న, లలితలు తమ కుంచెల నుంచి ఆవిష్కృతమైన పలు సందేశాత్మక, సామాజిక స్పృహకు సంబంధించిన అద్భుత చిత్రాలు కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన తీరు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. లంభోదరుడి విభిన్న ఆకృతులతో తీర్చిదిద్దిన చిత్రాలు, శక్తివంతురాలైన దుర్గమ్మ వారు, శివుడి తదితర దేవుళ్ల చిత్రాలు ఒక్కసారి భక్తి తన్మయత్వానికి గురి చేస్తున్నాయి. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రాముఖ్యత కలిగిన కళల వ్యాప్తికి, కళా, సాంస్కృతిక రంగాలను ప్రాధాన్యమిస్తూ ప్రోత్సహిస్తున్నారని కితాబిచ్చారు. కళలు భాషా, సాహితీ రంగాలకు తెలంగాణ ఖజానా అన్నారు.