పోర్ట్-ఓ-ప్రిన్స్: కరేబియన్ దేశమైన హైతీలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది. అత్యంత జనసాంద్రత కలిగిన రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్ నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని తెలిపింది. భూకంపం నేపథ్యంలో హైతీ సముద్ర తీర ప్రాంతంలో అలలు పది మీటర్ల ఎత్తున ఎగసిపడవచ్చని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది.
మరోవైపు భూకంపం ధాటికి హైతీ నైరుతి ద్వీపకల్పంలో పలు ఇండ్లు, స్కూళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. లెస్ ఆంగ్లైస్లో కాంక్రీట్ భవనాల శిథిలాలు, దెబ్బతిన్న చర్చి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, కొందరు మరణించి ఉంటారని, అయితే సంఖ్య ఎంత అన్నది ఇప్పుడే చెప్పలేమని హైతీ పౌర రక్షణ డైరెక్టర్ జెర్రీ చాండ్లర్ తెలిపారు. రెస్క్యూ బృందాలను రంగంలోకి దించామని, ప్రధాని కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు.
కాగా, 2010 జనవరిలో హైతీ రాజధానిలో 7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల సుమారు రెండు లక్షల మంది ప్రజలు మరణించగా మూడు లక్షలకుపైగా గాయపడ్డారు. ఈ భూపంకం ధాటికి రాజధానితోపాటు సమీప నగరాలు భవనాల శిథిల కుప్పలుగా మారాయి. దీంతో సుమారు పదిన్నర లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.