కోల్కతా: త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి, ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉండి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 291 మందితో పూర్తిస్థాయి జాబితాను టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ప్రకటించగా.. బీజేపీ 57 మందితో తొలిజాబితాను విడుదల చేసింది. నంద్రిగ్రామ్ నుంచి బరిలో దిగుతున్నట్లు మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించగా.. అక్కడి నుంచి సువేందు అధికారిని అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ అసెంబ్లీ ఎన్నికలను మరింత రక్తికట్టిస్తున్నాది. ఈ క్రమంలో వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంటున్నది.
వెస్ట్ మిడ్నిపూర్ జిల్లా పరిధిలోని దేబ్రా నియోజకవర్గం నుంచి ఇద్దరు మాజీ పోలీసు అధికారులు బరిలో నిలిచారు. ఒకరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఐపీఎస్ అధికారి హుమాయూన్ కబీర్ ఉండగా.. మరొకరు బీజేపీ తరఫున మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ బరిలో నిలిచారు. హుమాయూన్ కబీర్ చందన్నగర్ పోలీసు కమిషనర్గా పనిచేసి గత నెలలో పదవికి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు. ముగ్గురు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నప్పుడు గోలీమారో అంటూ అరిచి వార్తల్లో వ్యక్తిగా కబీర్ నిలిచారు. అనంతరం పోలీస్ కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. దేబ్రా నియోజకవర్గం నుంచి హుమాయూన్ కబీర్ను మమత అభ్యర్థిగా ప్రకటించడంతో.. బీజేపీ కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. భారతీ ఘోష్ ఇంతకుముందు ఝార్గ్రామ్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. మమతా బెనర్జీతో చాలా సన్నిహితంగా ఉన్న భారతీ ఘోష్.. ఓ బహిరంగసభలో అమ్మా అంటూ సంభోదించారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు.