కాబూల్: ఇస్లాం మత సాంప్రదాయాల ప్రకారం పరిపాలించే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో ఆ దిశగా ఒక్కో అడుగూ వేస్తున్నారు. తాజాగా అక్కడి హెల్మాండ్ ప్రావిన్స్లో క్షురకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. స్థానికులకు గడ్డాలు ట్రిమ్ చేయడం ఆపండి.. లేదంటే శిక్షలు తప్పవు అని హెచ్చరించారు. గడ్డం ట్రిమ్ చేయడం అనేది ఇస్లాం చట్టానికి విరుద్ధమని తాలిబన్లు స్పష్టం చేశారు. అటు కాబూల్లోనూ తాలిబన్ల నుంచి తమకు ఇలాంటి ఆదేశాలు అందినట్లు అక్కడి బార్బర్లు చెప్పారు. తాము మారిపోయామని, గతంలో కంటే భిన్నంగా పరిపాలిస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు ఇలాంటి కఠినమైన ఇస్లామిక్ చట్టాలను వాళ్లు అమలు చేస్తున్నారు.
హెల్మాండ్ ప్రావిన్స్లో ఇప్పటికే అందరు బార్బర్లకు తాలిబన్లు నోటీసులు పంపించారు. అండర్ కవర్లో ఉన్న తాలిబన్లను పంపించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ప్రణాళికలు కూడా వాళ్లు వేస్తున్నారు. అమెరికా స్టైల్స్ ఇక చాలని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా స్థానిక ఆఫ్ఘన్ యువత సెలూన్లకు వెళ్లి తమకు నచ్చిన స్టైల్స్లో హెయిర్కట్ చేయించుకోవడం అలవాటు చేసుకున్నారు. కానీ తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడంతో అక్కడి యువతకు, బార్బర్లకు కష్టాలు మొదలయ్యాయి.