న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో తొలిసారి వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను, గ్రామాలను విడిచిపెట్టి సరిహద్దు దాటుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. తమను క్షమించాలని మమతా బెనర్జీ, టీఎంసీని వేడుకుంటున్నారని, మతం మరేందుకు కూడా సిద్ధమని చెబుతున్నారని విమర్శించారు. మహిళలను ఇండ్ల నుంచి బలవంతంగా తీసుకెళ్లి బహిరంగ లైంగికదాడికి పాల్పడుతున్నారని స్మృతి ఇరానీ ఆరోపించారు. దళిత లేదా గిరిజన మహిళలను కూడా వదిలిపెట్టడం లేదని విమర్శించారు.
ఆరేండ్ల మనువడి ముందు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 60 ఏండ్ల మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని స్మృతి ఇరానీ తెలిపారు. బీజేపీ కార్యకర్త కావడం వల్లనే ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇంకా ఎంత మంది మహిళలు ఇలాంటి దారుణాలను మౌనంగా భరించాలి అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రుల కార్లపై రాళ్ల దాడి జరుగుతున్నప్పుడు వారి రాష్ట్రంలో సామాన్యులు సురక్షితంగా ఉన్నారా? అని మానవ హక్కుల కార్యకర్తలుగా చెప్పుకునే వారిని తాను ప్రశ్నించాలనుకుంటున్నానని అన్నారు. అత్యాచారానికి గురైన మహిళల కోసం ప్రెస్ క్లబ్ ముందు ఎందుకు నిరసన తెలుపలేదు అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు.