తిరువనంతపురం,జూన్ 26: కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అనేక రంగాలు కుదేలయాయి. దీంతో లక్షలాదిమంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు. అనేక మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ బ్యాంక్ సరికొత్త చర్యలు తీసుకుంది. వందల మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నది.కేరళలో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా పార్ట్టైమ్ ఉద్యోగాలను సృష్టించింది ఫెడరల్ బ్యాంక్.
నిరుద్యోగులకు వాటిని కేటాయించింది. ఇప్పటిదాకా 400 మందికి పైగా యువతకు ఉపాధిని కల్పించినట్లు ప్రకటించింది. కేరళ వ్యాప్తంగా ఉన్న తమ శాఖా కార్యాలయాల్లో వారిని నియమించినట్లు తెలిపింది. పార్ట్టైమ్ ఉద్యోగాల కింద 400 మందికి పైగా ఉపాధిని కల్పించామని, వారందరినీ కోవిడ్ వార్డెన్స్గా హోదా కల్పించినట్లు ఫెడరల్ బ్యాంక్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ పర్సన్ అజిత్ కుమార్ కేకే తెలిపారు.