భూమికి తిరిగొచ్చిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక
కేప్ కెనావెరాల్, సెప్టెంబర్ 19: అంతరిక్ష ప్రయోగాలతో ఏ మాత్రం సంబంధం లేని నలుగురు సాధారాణ పౌరుల రోదసి యాత్ర దిగ్విజయంగా ముగిసింది. పుడమికి 575 కిలోమీటర్ల ఎత్తులో మూడు రోజుల పాటు భూ కక్ష్యలో పరిభ్రమించిన స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌక సురక్షితంగా తిరిగి భూమిని చేరింది. శనివారం సాయంత్రం ఫ్లోరిడా తీరానికి చేరువలో అట్లాంటిక్ సముద్రంలో క్యాప్యూల్ దిగింది. నలుగురు పర్యాటకులు ఇజాక్మన్(38), హేలీ ఆర్సినో(29), క్రిస్ సెంబ్రోస్కీ(42), సియాన్ ప్రాక్టర్(51) అక్కడి నుంచి పడవల్లో ఒడ్డుకు చేరుకొన్నారు. ఈ యాత్రతో స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అంతరిక్ష పర్యాటక వ్యాపారంలోకి అడుగుపెట్టినట్టయింది. ఇన్స్పిరేషన్4 పేరుతో ఈ రోదసి యాత్ర బుధవారం ప్రారంభం అయింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ వ్యోమ నౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.