జొహెన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా అగ్నిగుండంలా మారింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా జైలుకు వెళ్లడంతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి బీభత్సం సృష్టిస్తున్నారు. భద్రతా దళాలు-ఆందోళనకారుల మధ్య జరుగుతున్న ఘర్షణలతో వీధులన్నీ రణరంగాన్ని తలపిస్తున్నాయి. దుకాణాలపై దాడులకు పాల్పడుతున్న స్థానికులు అందినకాడికి దోచుకుంటున్నారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులతోపాటు సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఘర్షణల్లో ఇప్పటివరకూ 72 మంది మరణించారని, 1,234 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దక్షిణాఫ్రికాలో 20 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ స్థాయిలో అల్లర్లు జరుగుతున్నా.. ఇక్కడి ఇండియన్ ఎంబసీ నుంచి ఎలాంటి సహకారం అందటంలేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా, భారతీయుల ఇబ్బందులను విదేశాంగ మంత్రి జైశంకర్, ఆ దేశ విదేశాంగ మంత్రి నలేడి పసండోర్ దృష్టికి తీసుకెళ్లారు.