న్యూఢిల్లీ, ఆగస్టు 22: వారం రోజులుగా ఎటు చూసినా తాలిబన్లు. వారి చేతుల్లో తుపాకులు. ముష్కరుల చెర నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గమైన కాబూల్ విమానాశ్రయానికి వచ్చే దారిలో ఎన్నో అడ్డంకులు. చెక్పోస్టుల గండాలు. అన్నింటినీ దాటుకొని ఎయిర్పోర్టుకు వస్తే రోజుల తరబడి నిరీక్షణ. ఊహకందని భయాన్ని, మాటలకందని వేదనను అనుభవించిన 329 మంది భారతీయులు ఆదివారం మాతృదేశానికి చేరుకొన్నారు. స్వేచ్ఛా వాయువులను పీల్చుకొన్నారు. ఆదివారం భారత వైమానిక దళం మూడు వేర్వేరు విమానాల్లో 392 మందిని ఇండియాకు తీసుకువచ్చింది. 168 మందితో కూడిన సీ-17 విమానం కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి నేరుగా ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అవగా, మరో రెండు విమానాలు తజకిస్తాన్లోని దుషాంబే, కతర్లోని దోహా నుంచి వచ్చాయి. ఆదివారం భారత్కు చేరుకొన్న సీ-17 విమానంలోనే 23 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు, అఫ్గాన్ ఎంపీలైన అనార్కలీ హోనర్యార్, నరేందర్ సింగ్ ఖల్సా, వారి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. కాగా, తజకిస్తాన్ నుంచి వచ్చిన వైమానిక దళం ప్రత్యేక విమానంలో 87 మంది భారతీయులు, ఇద్దరు నేపాలీలు వచ్చారు. వీరిని శనివారమే కాబూల్ నుంచి అక్కడికి తరలించారు. గడిచిన వారం రోజుల్లో అమెరికా, నాటో ఎయిర్క్రాఫ్ట్ల్లో దోహా వెళ్లిన 135 మంది భారతీయులను మరో ప్రత్యేక విమానంలో ఆదివారం ఇండియాకు తరలించారు. స్వదేశం చేరుకోగానే భారతీయులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేశారు. అయితే, అఫ్గాన్లో ఇంకా దాదాపు వెయ్యి మంది భారతీయులు చిక్కుకుపోయారన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
పలు దేశాల సమన్వయంతో
అమెరికా, కతార్, తజకిస్తాన్, ఇతర మిత్రదేశాల్లో సమన్వయమై భారత్ కాబూల్ నుంచి ఇండియన్లను రప్పిస్తున్నది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని విదేశాంగ శాఖ ఆదివారం తెలిపింది. ఇండియా ఇంతకుముందు భారత రాయబారి సహా 200కు పైగా మందిని రెండు సీ-17 విమానాల్లో ఇండియాకు తరలించింది. తాజాగా తీసుకువచ్చిన వారితో లెక్కిస్తే ఇప్పటివరకు 590 మందిని అఫ్గానిస్తాన్ నుంచి సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చారు.
తొక్కిసలాటలో ఏడుగురు మృతి
అఫ్గాన్ను విడిచి వెళ్లేందుకు జనం కాబూల్కు భారీగా తరలివస్తున్నారు. ప్రజలను నియంత్రించడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు బ్రిటన్ తెలిపింది. ఎయిర్పోర్టులో పరిస్థితులు తమకు సవాలుగా పరిణమించాయని, పరిస్థితిని చక్కదిద్దడానికి చేయగలిగినంత చేస్తున్నామని పేర్కొన్నది. బ్రిటన్ బలగాలు ఇప్పటివరకు అఫ్గానిస్తాన్ నుంచి 4వేలకు పైగా మందిని తరలించాయి. కాగా పాకిస్తాన్… కాబూల్కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.
ప్రభుత్వ ఏర్పాటుపై మంతనాలు
అఫ్గానిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటుపై తాలిబన్ అగ్రనేతలు మంతనాలు సాగిస్తున్నారు. శనివారమే కాబూల్ చేరుకొన్న తాలిబన్ సహవ్యవస్థాపకుడు బరాదర్ ముఖ్య రాజకీయ నేతలతో చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, హక్కానీ నెట్వర్క్ కమాండర్ ఖలీల్ హక్కానీ కూడా నిమగ్నమైనట్టు సమాచారం. ఖలీల్ తలపై అమెరికా గతంలో రూ.37 కోట్ల రివార్డు ప్రకటించింది.
ఇండియా నాకు రెండో ఇల్లు
ఇండియా తనకు రెండో ఇల్లు అని అఫ్గాన్ ఎంపీ నరేందర్ సింగ్ ఖల్సా అన్నారు. తాము అఫ్గాన్లో నివసిస్తున్నప్పటికీ అక్కడి ప్రజలు హిందూస్తానీలుగా పిలుస్తారని చెప్పారు. అఫ్గాన్లకు భార త్ సాయం చేయడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘అఫ్గానిస్తాన్లో అంతా అయిపోయింది. ఇంతకుముందెప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. 20 ఏండ్లలో మేం నిర్మించినదంతా కండ్ల ముందే కుప్పకూలిపోయింది. దేశాన్ని విడిచి రావడం తప్ప గత్యంతరం లేదు’ అని ఆయన కండ్ల నీళ్లు పెట్టుకొన్నారు.
కండ్ల ముందే కాల్చేశారు
అఫ్గాన్ నుంచి వెళ్లిపోవడానికి తాను కాబూల్ ఎయిర్పోర్టుకు వస్తుండగా తాలిబన్లు కొరడాలతో కొట్టి వెనక్కు పంపించారని ఓ అమెరికన్ మహిళ తెలిపారు. ఓవ్యక్తిని తుపాకీతో కాల్చిచంపడం తన కళ్లారా చూశానన్నారు. ఆమె ప్రస్తుతం అఫ్గాన్లోనే చిక్కుకుపోయారు. కాబూల్కు వెళ్లే దారుల్లో తాలిబన్లు 20కి పైగా చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తాలిబన్ల భయానికి ఎయిర్పోర్టుకు రావడానికి జంకుతున్నారు. అఫ్గానిస్తాన్ నుంచి తనను బయటపడేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ను వేడుకొన్నారు.
అఫ్గాన్ నుంచి వచ్చేవారికి పోలియో టీకాలు
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి వస్తున్నవారికి పోలియో వ్యాక్సిన్ వేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియాలో పోలియో వైరస్ మళ్లీ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా టీకాలు వేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం తెలిపారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్టు వివరించారు. అందరికీ ఉచితంగానే టీకాలు వేస్తున్నట్టు పేర్కొన్నారు. పోలియో వైరస్ ఇంకా వ్యాప్తిలో ఉన్న రెండే రెండు దేశాలు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్.
అమెరికా విమానంలో అఫ్గాన్ మహిళ ప్రసవం
కాబూల్: అమెరికా మిలిటరీ విమానంలో అఫ్గాన్ మహిళ ప్రసవించింది. కాబూల్ నుంచి బయల్దేరిన విమానం జర్మనీ వెళ్తుండగా మార్గమధ్యలో ఆమెకు పురుటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. వెంటనే పైలట్ విమానాన్ని ఎత్తు తగ్గించి నడిపారు. జర్మనీలోని రామ్స్టెయిన్ విమానాశ్రయంలో విమానం దిగగానే వైద్య సిబ్బంది ఆమెకు పురుడు పోశారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
పంజ్షీర్ దళాలతో రష్యా రాయబారం
కాబూల్: తాలిబన్లకు ఎదురొడ్డి నిలిచిన పంజ్షీర్ ప్రతిఘటన దళాలతో చర్చించేందుకు రష్యా ముందుకొచ్చింది. పంజ్షీర్ దళాలతో తమ తరఫున చర్చించాలని తాలిబన్లు తమను కోరినట్టు కాబూల్లోని రష్యా రాయబారి దిమిత్రి జిర్నోవ్ చెప్పారు. తాలిబన్లు రక్తపాతం కోరుకోవడం లేదని అన్నారు. చర్చలు జరుపడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.