సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 9 : కరోనా సోకిన బాధితుల కోసం నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఉదార స్వభావం చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో కరోనాతో బాధపడుతున్న వారికి ఎమ్మెల్సీ కవిత 15 రోజులుగా 30 మందికి రెమిడెసివిర్ ఇంజక్షన్లను అందజేస్తున్నారు. ఎమ్మెల్సీ పంపిన రెమిడెసివిర్ ఇంజక్షన్లను తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు శివశంకర్ పాటిల్ బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆదివారం ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల, దవాఖాన, బాలాజీ దవాఖాన, బాలాజీ మెడికవర్ దవాఖానలో కరోనా చికిత్స పొందుతున్న బాధితులకు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు శివశంకర్పాటిల్ నాలుగు రెమిడెసివిర్ ఇంజక్షన్లను అందజేశారు. ఆపద కాలంలో ఇంజక్షన్లును అందజేసిన ఎమ్మెల్సీ కవితకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.