కర్ణాటక సీఎం యెడియూరప్ప
బెంగళూరు, జూన్ 6: బీజేపీ హైకమాండ్ తనమీద నమ్మకం ఉంచినంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం యెడియూరప్ప తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగనున్నదని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆయన స్పందించారు. ‘హైకమాండ్ నామీద నమ్మకం ఉంచినన్ని రోజులు నేను ముఖ్యమంత్రిగా ఉంటా. అధిష్ఠానం నాకు ఒక అవకాశం ఇచ్చింది. దానిని మంచి చేయడానికోసం ఉపయోగిస్తాను. వాళ్లు నన్ను వద్దనుకున్న రోజు రాజీనామా చేసి రాష్ర్టాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తాను’ అని చెప్పారు. రాష్ట్రంలో తనకు ప్రత్యామ్నాయ నాయకుడు మరొకరు లేరనే వాదనతో తాను ఏకీభవించనని, రాష్ట్రంలోనే గాక దేశంలో ప్రత్యామ్నాయ నాయకులు ఎప్పుడూ ఉంటారని సీఎం యెడియూరప్ప వ్యాఖ్యానించారు.