హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): పెంచిన జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు, తనిఖీ ఫీజులను రద్దుచేయాలని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్, ఉపాధ్యక్షుడు ఎన్సీ పార్థసారథి.. రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గౌరీ సతీశ్ మాట్లాడుతూ.. గుర్తింపు, తనిఖీ ఫీజులను 33 శాతం పెంచడం సమంజసంకాదన్నారు. తమ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇంటర్బోర్డు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు.