హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అనేక విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టారని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసంలో హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వపరంగా చేయూతనిస్తూ వారి అభ్యున్నతికి అండగా నిలుస్తున్నారని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.