న్యూఢిల్లీ: సింగపూర్లో గురుద్వారా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆ దేశ ప్రధాని లీ సెన్ లూంగ్ .. సిక్కుల తలపాగాను ధరించారు. సత్ శ్రియాకాల్ అంటూ ఆయన పంజాబీ భాషలో సిక్కులకు గ్రీటింగ్ కూడా చెప్పారు. సిలత్ రోడ్డులో ఉన్న గురుద్వారాను ఇటీవల పునరుద్దరించారు. ఈ నేపథ్యంలో ఆ గురుద్వారా ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. విపత్కర సమయల్లో జాతి, మత వివక్ష లేకుండా సిలత్ గురుద్వారా అనేక మందిని ఆదుకున్నట్లు ప్రధాని లీ తెలిపారు. పునర్ నిర్మాణ పనుల సమయంలో గురుద్వారా పెద్దలు సహకరించిన తీరు పట్ల ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. సిక్కు వర్గంలో మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నవారికి ప్రాజెక్టు అకాల్తో స్వాంతన చేకూరుతున్నట్లు ఆయన చెప్పారు. ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లలో ఆయన కొన్ని ఫోటోలను, సందేశాన్ని పోస్టు చేశారు.