న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఇండ్ల పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏఎఫ్)కు చెందిన 2.6 లక్షల నకిలీ ఇండ్ల రుణ ఖాతాలను సీబీఐ గుర్తించింది. మొత్తం రూ.14,046 కోట్లలో రూ.11,755.79 కోట్లను బాంద్రా బుక్ సంస్థ వంటి పలు కంపెనీలకు అక్రమ మార్గాల్లో మళ్లించినట్లు ఆరోపించింది. ప్రధానమంత్రి ఇండ్ల పథకం వడ్డీ రాయితీ కింద రూ.1,887 కోట్లను దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) కేంద్ర ప్రభుత్వం నుంచి పొందినట్లు పేర్కొంది. ఈ కుంభకోణంలో డీహెచ్ఎఫ్ఎల్తోపాటు ఆ సంస్థ ప్రమోటర్లు కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్తోపాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులపై బుధవారం కేసు నమోదు చేసింది.
ఎస్ బ్యాంక్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం జైలులో ఉన్న సోదరులు కపిల్, ధీరజ్ కలిసి 2018లో నకిలీ ఇండ్ల రుణ ఖాతాలను సృష్టించినట్లు సీబీఐ తెలిపింది. గ్రాంట్ తోర్నటన్ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ద్వారా డీహెచ్ఎఫ్ఎల్లో జరిగిన ఈ అవకతవకలు బయటపడినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించింది.