అమల్లోకి ఎలక్షన్ కోడ్
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
పారదర్శకంగా రిజర్వేషన్ల ప్రక్రియ
కొవిడ్ నిబంధనల మేరకు ఓటింగ్
పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు, మెడికల్ క్యాంపులు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఫిర్యాదుల కోసం టోల్ఫ్రీ నంబర్ 18004251980
విలేకరుల సమావేశంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు
హన్మకొండ, ఏప్రిల్ 15 : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని, ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా గురువారం నుంచి కోడ్ అమలులోకి వచ్చిందని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వార్డుల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను డ్రా పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. ఈ ప్రక్రియను వీడియో తీశామని వివరించారు. 2021 జనవవరి 1న విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ లెక్కల మేరకు ఆయా కేటగిరీలకు వార్డులు కేటాయించామన్నారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని, సర్వేలైన్స్ బృందాలు, మైక్రో అబ్జర్వర్లు, కోడ్ అమలుకు ప్రత్యేకంగా నోడల్ అధికారిని, 81 మంది రిటర్నింగ్, మరో 81 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించామన్నారు. మొత్తం 878 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 6,52,969 మంది ఓటర్లు ఉన్నారని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లోని ఎలక్షన్ సెల్లో 18004251980 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచామన్నారు. హన్మకొండలోని నిట్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించాలని, వీరికి ఎన్ 95 మాస్కులు, ఫేష్షీల్డులు కూడా అందిస్తామని వివరించారు. ఓటర్లు కూడా కొవిడ్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్తో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా మూడు వర్గాల వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించినట్లు చెప్పారు. వీరిలో 80 సంవత్సరాల వయస్సు దాటిన వారు, పీడబ్ల్యూడీ (దివ్యాంగులు), కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ఈ అవకాశం కల్పించామన్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారానికి సువిధ పోర్టల్ ద్వారా అనుమతి ఇస్తామన్నారు.
అధికారులతో సమీక్ష
ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ హన్మంతు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఎంసీసీ అమలు, బ్యాలెట్ పేపర్ ముద్రణ, ట్రాన్స్ఫోర్టు, మెటీరియల్, కాల్ సెంటర్ ఏర్పాట్లు తదితర అంశాలపై నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. మ్యాన్పవర్ శిక్షణ కార్యక్రమాలను చూసుకోవాలని సీపీవో, డీఈవో, డీఐవోలను కలెక్టర్ ఆదేశించారు. పీవో, ఏపీవోలకు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా శిక్షణ పూర్తి చేయాలన్నారు.
బ్యాలెట్ బాక్సుల నిర్వహణ బాధ్యతలను డీపీవో, జీడబ్ల్యూఎంసీ సెక్రెటరీలకు, ట్రాన్స్ఫోర్టు మేనేజ్మెంట్ను జిల్లా ట్రాన్స్పోర్టు అధికారికి, కాల్సెంటర్, హెల్ప్లైన్, ఫిర్యాదుల సెల్ ఏర్పాటుపై జిల్లా మైనార్టీ అధికారిని, లా అండ్ ఆర్డర్ బాధ్యతలను డీసీపీ, డీఆర్వోలకు, మీడియా సెంటర్ నిర్వహణను సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులకు అప్పగించారు. మైక్రో అబ్జర్వర్లుగా సీపీవో, ఎల్డీఎం వ్యవహరిస్తారని చెప్పారు. కలెక్టర్ వెంట నగర కమిషనర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఆర్వో వాసుచంద్ర, జీడబ్ల్యూఎంసీ ఏసీ నాగేశ్వర్రావు, డీఆర్డీవో ఏ శ్రీనివాస్కుమార్, సమాచార శాఖ ఇన్చార్జి ఏడీ బీ పల్లవి, ఎంహెచ్వో రాజారెడ్డి ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్.. 36 పరుగులకే 3 వికెట్లు