సింగపూర్: కరోనా టీకా వేయించుకున్న వారం రోజుల వరకు వ్యాయామానికి దూరంగా ఉండాలని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం సూచించింది. కరోనా వ్యాక్సినేషన్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సవరించిన మార్గదర్శకాలను ఈ మేరకు జారీ చేసింది. ప్రధానంగా 30 ఏండ్ల లోపు వారు ముందు జాగ్రత్త కోసం కరోనా టీకా తర్వాత వారం రోజుల వరకు వ్యాయామానికి దూరంగా ఉండాలని పేర్కొంది. ఫైజర్ సంస్థకు చెందిన బయోఎంటెక్ టీకా తొలి డోసును 16 ఏండ్ల బాలుడు జూన్ 27న తీసుకున్నాడు. కాగా, ఈ నెల 3న అతడు జిమ్లో బరువులు ఎత్తుతుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో సుమారు 12 మందికి గుండె సంబంధ సమస్యలు వచ్చినట్లు ఆ దేశ వైద్య అధికారులు గుర్తించారు. ఇందులో ఏడుగురు 30 ఏండ్ల వయసులోపు వారే.
ఇజ్రాయెల్, అమెరికాలో కూడా ఫైజర్ టీకా తీసుకున్న కొందరిలో ఇలాంటి సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త కోసం టీకా వేయించుకున్న వారం వరకు భారీ వ్యాయామాలకు దూరంగా ఉండాలని దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు సింగపూర్ ప్రభుత్వం సూచించింది.