హైదరాబాద్, జూలై 2 (నమస్తేతెలంగాణ): గుంజుకోవటానికి తెలంగాణ నీ అబ్బసొత్తు కాదని పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్రెడ్డిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. కేసీఆర్ 14 ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు రేవంత్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణభవన్లో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కనీవిని ఎరుగని అభివృద్ధి జరుగుతున్నదని..రేవంత్రెడ్డి కండ్లుండి చూడలేని కబోదిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మంత్రులుగా ఉన్నప్పుడు ఈ విధంగా అభివృద్ధి చేయలేకపోయామనే పశ్చాత్తాపం వెంటాడుతున్నదని ఆయన అన్నారు.
పార్టీ మారుతానంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, తుదిశ్వాస వరకు టీఆర్ఎస్లోనే ఉంటానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్లో ఉన్నదాని కంటే టీఆర్ఎస్లో వందరెట్లు ఎక్కువ సంతృప్తిగా ఉన్నానని, టీఆర్ఎస్లో చిచ్చుపెట్టాలనుకునేవారికి పుట్టగతులండవని ధ్వజమెత్తారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనను ఎవరూ కలవలేదని..ఎవరైనా కలవాలని అనుకుంటే గులాబీ కండువా వేసుకున్నాకే ఇంట్లోకి రావాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్లు ఇప్పటికైనా బయటకురావాలని..రేవంత్రెడ్డి కింద ఎలా పనిచేస్తారని దానం ప్రశ్నించారు.