దండేపల్లి: మార్చి 23 : అదో చిన్న గ్రామం.. 828 జనాభా, 8 వార్డులుంటాయి.. గతంలో దండేపల్లి జీపీలో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తండాలను జీపీలుగా మార్చడంతో ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ఆ గ్రామ స్వరూపాన్ని మార్చేసింది. అన్ని హంగులను సమకూర్చుకుంటున్నది. ఓ వైపు స్వచ్ఛత, మరోవైపు పచ్చదనంతో సరికొత్త కళ సంతరించుకుంది. అదే దండేపల్లి మండలంలోని కర్ణపేట. గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం, రైతువేదిక, డంప్ యార్డ్, వైకుంఠధామం నిర్మాణాలతో గ్రామానికి సరికొత్త రూపు వచ్చింది. ప్రజలు, అధికారుల సమన్వయంతో ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు ఖర్చు చేయడంతో కర్ణపేట గ్రామ ముఖచిత్రం మారిపోయింది. ముఖ్యంగా గ్రామంలో రూ.12 లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. రూ.2.52 లక్షలతో డంప్యార్డు నిర్మాణం చేపట్టారు. ఇవి దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. గ్రామ సమీపంలో కడెం ప్రధాన కాలువ పక్కన నిర్మించిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరంగా మారింది.
రకరకాల పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలో చుట్టూ ఫెన్సింగ్, ప్రకృతి ప్రేమికుల కోసం వాకింగ్ ట్రాక్, సందర్శకులు సేదదీరేందుకు బెంచీలు, గేటు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చే నిధులే కాక జీపీ నుంచి రూ.లక్షతో పార్క్ను అభివృద్ధి చేశారు. సుమారు 4వేల మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా ఒక వన సేవకుడిని నియమించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. వీటి సంరక్షణకు సిబ్బందిని నియమించారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇవ్వడంతో జీపీ సిబ్బంది గ్రామ పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. దండేపల్లి క్లస్టర్ పరిధిలోని రైతు వేదికను కర్ణపేటలో రూ.22 లక్షలతో నిర్మించారు. ఈ మధ్యే ఎమ్మెల్యే దివాకర్రావు ప్రారంభించారు. దీంతో రైతులందరూ ఒకచోట చేరి వ్యవసాయ అధికారులతో చర్చించుకునే అవకాశం ఏర్పడింది. గ్రామంలో నిర్మించిన ఓహెచ్ఆర్, సంపులతో మారుమూల గిరిజన గూడేలు, తండాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తున్నారు.
ప్రజలు, పై అధికారుల సహకారంతోనే..
ప్రజలు, పై అధికారుల సహకారం తోనే గ్రామంలో అభివృద్ధి పను లు చేపడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్, ట్యాంకర్తో హరితహారంలో నాటిన మొక్క లను సంరక్షించుకుంటున్నాం. పల్లె ప్రకృతి వనంలో జీపీ నుంచి అదనంగా రూ.లక్ష వరకు ఖర్చు చేసి అందంగా తీర్చిదిద్దాం. గ్రామస్తులు ప్రతిరోజూ సేదదీరేందుకు వస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం.
-సునిత, జీపీ కార్యదర్శి, కర్ణపేట