సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే మెడికల్ హబ్గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్ మహానగరం చుట్టూ నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు శనివారం రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై అటు ప్రజలు, ఇటు వైద్యసిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడమే గాక రోగిని గోల్డెన్ మినిట్స్లో దవాఖానకు తరలించే వీలుంటుందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం నగరంలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానలే సూపర్ స్పెషాల్టీ సేవలు అందిస్తున్నాయి. దీనివల్ల ఇటు గ్రేటర్ పరిధిలోని రోగులతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే రోగుల భారం ఈ మూడు దవాఖానలపైనే పడుతున్నది. ఒక్కో దవాఖానలో నిత్యం 2000కు పైనే రోగులు ప్రతిరోజూ ఓపీ సేవలు పొందుతున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు నగరంలోకి ప్రవేశించాలంటే గంటల తరబడి ట్రాఫిక్ సమస్యను ఈదుకుంటూ వచ్చి వైద్య సేవల కోసం రెండు మూడు రోజులు నగరంలోనే ఉండాల్సిన పరస్థితులు ఎదురవుతున్నాయి. దీన్ని గమనించిన రాష్ట్ర సర్కారు రాష్ట్రం ఆవిర్భవించిన మొదటి నుంచే పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో నగరం చుట్టూ నాలుగు సూపర్ స్పెషాల్టీ దవాఖానలను నిర్మించాలని సంకల్పించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
గడ్డిఅన్నారం పండ్లమార్కెట్, అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ వెళ్లే మార్గంలో, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన ప్రాంగణంలో కొత్తగా మూడు సూపర్స్పెషాల్టీ దవాఖానలను నిర్మించడంతో పాటు ప్రస్తుతం ఉన్న టిమ్స్ దవాఖానను సైతం సూపర్ స్పెషాల్టీ దవాఖానగా అప్గ్రేడ్ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
గ్రేటర్ చుట్టూ నిర్మించనున్న నాలుగు సూపర్ స్పెషాల్టీ దవాఖానల వల్ల గ్రేటర్ ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ప్రజలకు కూడా వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి. ముఖ్యంగా అల్వాల్-ఓఆర్ఆర్ మధ్య నిర్మించనున్న సూపర్ స్పెషాల్టీ దవాఖాన వల్ల సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల ప్రజలు ట్రాఫిక్ సమస్య లేకుండా సులువుగా చేరుకోవచ్చు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో నిర్మించనున్న సూపర్ స్పెషాల్టీ దవాఖాన వల్ల నల్గొండ, వరంగల్, యాదాద్రి-భువనగిరి తదితర జిల్లాల ప్రజలు, గచ్చిబౌలిలోని టిమ్స్ వల్ల రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలకు వైద్యసేవలు చేరువ కావడంతో పాటు సులభంగా దవాఖానలకు చేరుకునే వీలుంటుంది.