బీజింగ్, జూన్ 21: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాకు పుట్టినిల్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనాలో మరోసారి అనుమానాస్పద పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇటీవల ఆ దేశంలో ఒక అణుశక్తికేంద్రంలో భారీ ఎత్తున రేడియేషన్ లీకేజీ చోటుచేసుకోగా, దీని ప్రభావం తీవ్రంగా ఉండనుందని వార్తలు వెలువడ్డాయి. కానీ, చైనా ప్రభుత్వం ఆ వార్తలను కొట్టివేసింది. అయితే, ఇంతలోనే ఆ దేశానికి చెందిన అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్త అత్యంత అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. అణు లీకేజీ ఘటనకు, శాస్త్రవేత్త మరణానికి సంబంధం ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.
దెబ్బతిన్న ఫ్యూయల్రాడ్లు
చైనాలోని తాయ్షాన్ అణుశక్తి కేంద్రంలో ఇటీవల ఐదు ఫ్యూయల్రాడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్తోపాటు పలువురు దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైనాలోని ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ఝాంగ్ ఝిజియాన్ ఈ నెల 18న ఓ ఎత్తయిన భవనంపైనుంచి పడి మరణించారు. ఆయన మరణించటానికి రెండు రోజుల ముందే హార్బిన్ యూనివర్సిటీ వీసీగా మరో అణుశాస్త్రవేత్త జింగ్వీని నియమించారు. వరుసగా సంభవించిన ఈ పరిణామాల మధ్య బయటపడని ఏదో లింక్ ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.