ఖార్టూమ్ : సూడాన్లో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. తాత్కాలిక ప్రధాని అబ్దుల్లా సహా పలువురు అధికారులను రహస్య నిర్బంధం విధించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే సూడాన్లో ఆర్మీ జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్ అత్యవసర అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ అధికార మండలితో పాటు ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేశారు. సైన్యం తిరుగుబాటు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపు చేసేందుకు సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
మొత్తం ఘర్షణల్లో ఏడుగురు మృతి చెందారని, 140 మంది వరకు గాయపడ్డారని ఆరోగ్య అధికారులు తెలిపారు. రెండేళ్ల క్రితమే ఒమర్ అల్ బషీర్ సుదీర్ఘ పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్యం వైపు సుడాన్ అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో సైనిక తిరుగుబాటు జరగడం ఆ దేశానికి ప్రతికూలంగా మారనుంది. సైనికాధికారులు తిరుగుబాటుకు సెప్టెంబర్లోనే ప్రయత్నించినా అది విఫలమైంది. అప్పటి నుంచి సుడాన్ రాజకీయ నేతలు, మిలిటరీ అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆ దేశం సైనిక పాలనలోకి జారుకుంది. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టాలని దేశంలోని ప్రజాస్వామ్య పార్టీలు పిలుపునిచ్చాయి.
ఖార్టూమ్, అమ్డుర్మన్ నగరాల్లోని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. పరిస్థితిని అదుపుచేసేందుకు భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. సూడాన్లో పరిస్థితిపై అగ్రరాజ్యం అమెరికా, ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేశాయి. సైన్యం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అమెరికా.. సూడాన్కు 700 మిలియన్ డాలర్ల ఆర్థిక నిలిపివేసింది. నిర్బంధంలో ఉంచిన ప్రధానితో మిగితా వారందరినీ తక్షణమే విడుదల చేయాలని సూచించింది.