కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో మమత అధ్యక్షతన సమావేశం జరిగింది.
మే 5న ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరుసటి రోజు (మే 6న) మంత్రవర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు పార్థచటర్జీ తెలిపారు.
నందిగ్రామ్లో రీకౌంటింగ్ నిర్వహించాలని ఇప్పటికే ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
రాజ్యాంగాన్నిఅనుసరించి ఏ నియోజకవర్గం నుంచి ఎన్నిక కాకుండా మరో 6 నెలలపాటు మమత బెనర్జీ సీఎంగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది.
మొత్తంగా 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 8 విడుతల్లో 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
మిగతా రెండు చోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు కరోనాతో మరణించడంతో ఎన్నికలు నిర్వహించలేదు.
ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 213 సీట్లను కైవసం చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.