వాషింగ్టన్: ఒక వినోద పార్క్లోని కాస్ట్యూమ్ క్యారెక్టర్లు నల్లజాతి పిల్లలను కించపరిచారు. దీంతో ఒక చిన్నారి తల్లిదండ్రులు ఆ సంస్థపై సుమారు రూ.200 కోట్లకు దావా వేశారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ సంఘటన జరిగింది. గత నెలలో సెసేమ్ స్ట్రీట్ థీమ్ పార్క్కు జనం పోటెత్తారు. పలు కాస్ట్యూమ్ క్యారెక్టర్లుగా అలరించిన వ్యక్తులు తెల్లజాతి పిల్లలతో చేతులు కలిపి సరదా చేశారు. రోసిటా కాస్ట్యూమ్ తెల్లజాతి చిన్నారులు, మహిళలకు హై-ఫైవ్ ఇస్తుంది. అయితే నల్లజాతి పిల్లలు తమ చేతులను ముందుకు చాపగా నో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ ఈవెంట్లో పాల్గొన్న మరి కొందరు నల్లజాతి పిల్లలకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. దీంతో వారు చిన్నబోయారు.
కాగా, ఒక నల్లజాతి చిన్నారి తల్లిదండ్రులు సెసేమ్ సంస్థపై కోర్టును ఆశ్రయించారు. జాతి వివక్ష చూపినందుకు 25 మిలియన్ డాలర్లకు (రూ.199 కోట్లు) దావా వేశారు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జాతి వివక్షను పలువురు ఖండించారు. ‘మా డబ్బులు కావాలి కానీ, మాకు గౌరవం ఇవ్వరు’ అంటూ ఒకరు మండిపడ్డారు. ఆ పార్క్కు ఇకపై వెళ్లబోనని మరొకరు శపథం చేశారు.
మరోవైపు ఆ పార్క్ దీనిపై క్షమాపణలు చెప్పింది. మరోసారి ఇలా జరుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అలాగే కాస్ట్యూమ్ క్యారెక్టర్ల సిబ్బందికి తగిన శిక్షణ ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే రెండు బహిరంగ ప్రకటనలు విడుదల చేసింది.