కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని జలాలాబాద్లో శనివారం మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో తాలిబన్ అధికారులతోపాటు ముగ్గురు చనిపోగా, 20 మంది గాయపడినట్లు సమాచారం. నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్లో తాలిబన్ వాహనాల లక్ష్యంగా ఈ బాంబు పేలుళ్లు జరిగినట్లు స్థానిక అధికారులు టోలో న్యూస్కు తెలిపారు. తాలిబన్ దళాల వాహనాలు వెళ్తుండగా రోడ్డు పక్కన అమర్చిన మందుపాతరను పేల్చారని చెప్పారు.
గాయపడిన సుమారు 20 మందిని ఆసుపత్రికి తరలించారని, వీరిలో చాలా మంది పౌరులని హాస్పిటల్ అధికారులు వెల్లడించారు. కాబూల్కు 80 మైళ్ల దూరంలోని జలాలాబాద్లో జరిగిన ఈ దాడి తామే చేసినట్లు ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు. కాగా, ఆగస్ట్ 15న ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు మరోసారి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నప్పటి నుంచి ఆ దేశంలో పలు చోట్ల బాంబు పేలుళ్లు జరుతూనే ఉన్నాయి.