న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరం తీవ్రతను బట్టి దోషికి ఏకంగా వెయ్యేండ్లకు పైగా జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. సెల్లో అబ్రమ్ మాపున్యా (33) అనే వ్యక్తి 2014-19 మధ్య ఇండ్లలో చొరబడి దొంగతనాలు చేసేవాడు. దొంగతనాలతోపాటు మహిళలపై అత్యాచారాలకు కూడా పాల్పడేవాడు. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సెల్లో అబ్రమ్ మాపున్యాను అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపిన కోర్టు.. నిందితుడు సెల్లో అబ్రమ్ మాపున్యాను దోషిగా తేల్చింది. సెల్లో అబ్రమ్ మొత్తం 40 ఇండ్లలో చోరీలకు పాల్పడటంతోపాటు 41 మంది మహిళలపై అత్యాచారం చేసినట్టు ధ్రువీకరించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం సెల్లో అబ్రమ్ మాపున్యాకు 1,088 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.